
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భద్రత మరింత కట్టుదిట్టం చేయడానికి ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవో వెంకటరావు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటరావు మాట్లాడుతూ ఆలయ భద్రత, భక్తుల సౌకర్యార్థం ఆలయానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులు, హోంగార్డుల సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టంను మెరుగుపర్చాలని సూచించారు. ఆలయానికి కల్పించే భద్రతా చర్యల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వన మహోత్సవాన్ని సక్సెస్ చేయాలి..
ప్రభుత్వం సూచన మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో జూలై ఒకటి నుంచి నిర్వహించే వన మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని ఆలయ అధికారులను ఈవో వెంకటరావు ఆదేశించారు. ఆలయ పరిధిలో మొత్తం ఐదు ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. వన మహోత్సవాన్ని సక్సెస్ చేయడం కోసం ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.